Narendramodi Azadi Plan : నరేంద్రమోదీ ఆజాదీ మంత్రం – ప్రధాని కన్నీళ్ల వెనుక కహానీ ఏంటో తెలుసా? కాంగ్రెస్ పార్టీకి చెక్పెట్టేందుకేనా?
మోదీ కన్నీళ్ల వెనుక కొత్త కథ :
నరేంద్రమోదీ-అమిత్ షా జోడి… బీజేపీ నయా తరంలో వినిపించే కామన్ స్లోగన్.. ఇప్పుడు జస్ట్ ఫర్ చేంజింగ్ అన్నట్లుగా నరేంద్రమోదీ-ఆజాద్ జోడీ అన్నట్లు తయారైంది పరిస్థితి. కొత్తగా ఇద్దరు మిత్రులు ఒకరినొకరు తెగ పొగిడేసుకోవడం పొలిటికల్ ట్రెండింగ్ అవుతోంది. ఢిల్లీ రాజకీయాలు దగ్గర్నుండి గమనించే పొలిటికల్ పండితులు దీని వెనుక పెద్ద కథే ఉందని విశ్లేషణలు అల్లుతున్నారు. ఏమో నిజమే కావచ్చు.. పాలిటిక్స్ అంటేనే డైనమిక్స్. శత్రువు-మిత్రుడు.. ప్రత్యర్థి-అభ్యర్థి అనే తేడా ఎప్పుడు ఎలా మారుతుందో సరిగ్గా ఊహించగలిగితే పొలిటికల్ సోషల్ ఇంజినీరింగ్లో పట్టభద్రులు కావచ్చు. ఈ విషయంలో నరేంద్రమోదీ మాస్టర్ డిగ్రీ కాదు ఏకంగా డాక్టరేట్ సాధించాడని అనేవారు లేకపోలేదు.
కాంగ్రెస్ సీనియర్లకే గాలం :
కాంగ్రెస్ ముక్త్ భారత్.. గత రెండు సార్వత్రిక ఎన్నికల సమరం నుంచి దేశానికి, తన పార్టీకి నరేంద్రమోదీ ఇస్తున్న స్లోగన్. నార్త్లో గెలిచేందుకు ఇక ఏమీ మిగల్లేదు.. సౌత్లో సత్తా చాటుదామనుకుంటున్న బీజేపీ.. పనిలో పనిగా కాంగ్రెస్పై ప్లాన్ బీ అమలు చేస్తుందనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. అద్వానీ-వాజ్పేయ్ జోడీ టైమ్లో పార్టీ సొంతంగా ఎదుగుదలపైనే దృష్టి పెట్టేది. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ప్రాతిపదిక మాత్రమే పనిచేసేది. మోడీ-అమిత్షా జోడీ ఫస్టాఫ్లో మరో అడుగు ముందుకేసి ఇతర పార్టీల్లోని కీలక నేతలకు కాషాయ కండువా కప్పడం మొదలెట్టి రాష్ట్రాల్లో జెండా ఎగరేయగలిగారు. ఇప్పుడు ఎవరూ ఊహించని రీతిలో అసలు సిసలు కాంగ్రెస్ హైకమాండ్గా ముద్రపడ్డ సీనియర్ల అసంతృప్తిని క్యాచ్ చేసుకుందని టాక్. అందులో భాగమే ఆజాద్ కోసం నరేంద్రమోదీ కన్నీళ్లు.. ప్రధానిపై గులాంనబీ ప్రశంసలు అనేవారు ఎక్కువవుతున్నారు.
రాహుల్తో అంతరాన్ని క్యాచ్ చేస్తున్న తంత్రం :
కాంగ్రెస్లో పాతుకుపోయిన సీనియర్ల పెత్తనాన్ని యువరాజు రాహుల్ గాంధీ తొలి నుంచి భరించలేకపోతున్నారు. ఇందిర, రాహుల్, సోనియా టైమ్లో వెలుగు వెలిగిన సీనియర్ల స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఏమాత్రం నచ్చని రాహుల్ గాంధీ కొత్త కోటరీ నియమించుకున్నారు. వెటరన్స్ వర్సెస్ జూనియర్స్గా సాగిన కాంగ్రెస్ పాలిటిక్స్లో రాహుల్ గాంధీ ఏకంగా హస్తం పార్టీ అధ్యక్ష బాధ్యతలు వదులుకోవాల్సి వచ్చింది. అస్త్ర సన్యాసం చేసి ఏమీ పట్టనట్లు తిరుగుతున్న రాహుల్కు సోనియా రెండోసారి పట్టాభిషేకానికి సిద్దమైన టైమ్లో జీ-23 అసంతృప్త గ్రూప్.. బ్రేక్ వేసింది. టెన్ జన్పథ్ అంతఃపురంలో జరిగిన రాజకోట రహస్యాన్ని పనిగట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. కాంగ్రెస్ సీనియర్లకు గాలమేశారనే నేడు ఆజాద్ ఆడుతున్న పొలిటికల్ ఇన్నింగ్స్ అనేది అందరు అనుకునే మాట..
కాంగ్రెస్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకైనా రాహుల్ శకం మళ్లీ రాకమానదు. సీనియర్లు తెరమరుగు కాకతప్పదు. రాహుల్ హస్తిన అంతఃపురాన్ని వీడివచ్చి దేశాన్ని చుట్టేస్తున్నారు. కీలకమైన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుంటే సోదరసోదరీమణులు రాహుల్-ప్రియాంక గాంధీలు కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. అనారోగ్యం రీత్యా అమ్మ సోనియమ్మ ఆక్టివ్ పాలిటిక్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇదే టైమ్లో జీ-23 అసంతృప్త సీనియర్ల గ్రూప్ విభీషణ పాలిటిక్స్కు దిగుతోందనే టాక్ నడుస్తోంది. జమ్ము కశ్మీర్లో సీనియర్ల మీటింగ్ పెట్టిన ఆజాద్.. ప్రధాని మోడీని పొగడటం అనేది ఇప్పుడు తెరపైకి వచ్చిందనేది పొలిటికల్ అనాలిసిస్.. పశ్చిమ బెంగాల్లో పొత్తుల విషయంలోనూ తమ పాత్ర ఏమీ లేకుండా చేశారనేది కూడా సీనియర్లకు మింగుడు పడని విషయం. ఎన్నికలు జరుగుతున్న తమిళనాడు వంటి కీలక రాష్ట్రాలకు ఒకప్పుడు ఇంఛార్జ్ హోదాలో చక్రం తిప్పారు ఆజాద్. నెంబర్ టూగా వెలుగువెలిగిన ఆజాద్.. తాజాగా రాహుల్కు వ్యతిరేకంగా చక్రం తిప్పడంలో తన వ్యూహాలకు పదనుపెట్టడంలో భాగమే ప్రధానిపై పొగడ్తల వర్షమని టాక్ వస్తోంది.