''సోమాలియా దేశం నుంచి 500 టన్నుల అరటిపండ్లు భారతదేశానికి దిగుమతి అయ్యాయి. ఆ పండ్లలో భయంకరమైన హెలికోబ్యాక్టర్ అనే పురుగులున్నాయి. ప్...
''సోమాలియా దేశం నుంచి 500 టన్నుల అరటిపండ్లు భారతదేశానికి దిగుమతి అయ్యాయి. ఆ పండ్లలో భయంకరమైన హెలికోబ్యాక్టర్ అనే పురుగులున్నాయి. ప్రాణాలకే హాని కలిగించే ఆ పురుగులు ఉన్న అరటిపండ్లు తింటే 12 గంటల్లో బ్రెయిన్ డెడ్ అవుతుంది. మనుషులు పిట్టల్లా రాలిపోతారు.'' అంటూ సోషల్ మీడియాలో ఓపోస్ట్ వైరల్ అవుతోంది.
ఆ పోస్ట్తో పాటు.. ఓ వీడియోను కూడా షేర్ చేస్తున్నారు. ఆ వీడియోను గమనిస్తే అరటిపండ్లను చిదిమితే మధ్యలో ఓ భయంకరమైన పురుగు కనిపిస్తోంది.
ఫేస్బుక్, ట్విట్టర్మాత్రమే కాదు.. ఎక్కువగా వాట్సప్లో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. వీడియో చూస్తున్న వాళ్లందరినీ భయపెడుతోంది. దీంతో, కలకలం చెలరేగుతోంది. అంతేకాదు.. మార్కెట్లో అరటిపండ్ల కొనుగోళ్లు కూడా తగ్గిపోయాయి.
అయితే, ఈ వైరల్ పోస్ట్పై Factful నిజనిర్ధారణ చేసింది. ఈ పోస్ట్ కథా కమామీషు ఏంటో తెలుసుకోవాలని డిసైడయ్యింది.
Factful Factcheck - ఏదినిజం? :
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ల మూలాలేంటో కనుగొనేందుకు Factful ప్రయత్నించింది. దీంతో, షాకయ్యే రిజల్ట్స్ బయటపడ్డాయి. ఈ వీడియోతో కూడిన ఓ పర్షియన్ కథనం ప్రకారం.. సోమాలియా నుంచి ఈ అరటిపండ్లను ఇరాన్కు దిగుమతి చేసుకున్నట్లు క్లెయిమ్ చేసుకున్నారు. దీంతోపాటు.. ఇదే వాదనతో మరికొన్ని కథనాలు కూడా కనిపించాయి. అంతేకాదు.. పశ్చిమాసియాలోని పలుదేశాల్లోనూ ఈ వీడియో వైరల్ అయ్యింది. గల్ఫ్ దేశాల్లో కలకలం సృష్టించింది. దీంతో.. అబుదాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది తప్పుడు ప్రచారం అని అధికారికంగా పేర్కొంది. అంతటితో ఆగకుండా తమ పరిధిలో ఈ వీడియోను ఇంటర్నెట్లో కనిపించకుండా తొలగించింది.
దీంతో, ఇదేదో ఫేక్ క్లెయిమ్ అన్న నిర్ధారణ అయ్యింది.
మరి.. భారత్ ప్రస్తావన మతలబేంటి? హెలికోబాక్టర్ అసలు స్వరూపం ఏంటి?
నిపుణుల కథనం ప్రకారం.. హెలికోబాక్టర్ పైలోరీ అనేది అసలు పురుగే కాదు.. అదో రకమైన బ్యాక్టీరియా. హెలికోబాక్టర్తో అంటువ్యాధులు చాలా సాధారణంగా సోకుతాయి. స్పష్టంగా ప్రపంచంలోని మూడింట రెండు వంతుల వారి శరీరంలో ఇది ఉంటుంది. చాలా మందికి, బ్యాక్టీరియా - వివిధ రకాలుగా జీర్ణవ్యవస్థలో ప్రవేశించి జీవిస్తుంది. కానీ, ఎటువంటి లక్షణాలను కలిగించదు. మంచి ఆరోగ్య అలవాట్లు, స్వచ్ఛమైన తాగునీరు మరియు పారిశుధ్యం అందుబాటులో ఉంటే, ఈ బ్యాక్టీరియా నుండి రక్షించుకునే అవకాశం ఉంటుంది.
అరటిపండులో పురుగుల సంగతేంటి?
వైరల్ అవుతున్న వీడియోలో చూస్తే పురుగులు కదులుతున్నాయి. అయితే, ఇలాంటి పురుగులు ఒక్కోసారి సర్వ సాధారణమేనని, వీటితో ప్రాణభయమేమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు. లార్వాదశలో ఉన్న ఇలాంటి పురుగులను మాగ్గోట్స్ అంటారని, మాగ్గోట్స్ గుడ్లు పెట్టినప్పుడు ఇలాంటి పురుగులు కనిపిస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు.
అరటిపండ్లు దిగుమతి చేసుకోవడం అవసరమా?
ప్రపంచవ్యాప్తంగా లభించే చవకైన పండ్లలో అరటిపండ్లు ప్రధానమైనవి. ప్రపంచంలోనే అరటిపండ్ల ఉత్పత్తిలో భారతదేశం ఐదవ స్థానంలో ఉంది. అరటిపండ్లు భారత్ నుంచే ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అరటిపండ్లను విదేశాల నుంచి.. అది కూడా కరువుతో అల్లాడే సోమాలియా నుంచి దిగుమతి చేసుకునే అవసరం భారత్కు లేదు. అధికారిక నివేదికల ప్రకారమే 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 619 కోట్ల విలువైన అరటిపండ్లను ఎగుమతి చేసింది.
ఆధారమేదీ లేదు :
సోమాలియా నుండి 500 టన్నుల అరటిపండ్లు భారతదేశంలోకి దిగుమతి అయ్యాయని నిరూపించడానికి ఎటువంటి అధికారిక డేటా అందుబాటులో లేదు. భారతదేశం సోమాలియా నుండి అరటిపండును అస్సలు దిగుమతి చేసుకోలేదని వాణిజ్య మంత్రిత్వ శాఖ వివరాలు కూడా నిదర్శనంగా నిలుస్తున్నాయి.
అంతేకాదు.. ఈ వీడియోకు సంబంధించి భారత ఆహార భద్రత- ప్రమాణాల సంస్థ - fssai కూడా స్పందించింది. వాట్సప్లో వైరల్ అవుతున్న వీడియోలో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. వైరల్ అవుతున్న వీడియో అసలు మన దేశానికి చెందినది కాదని పేర్కొంది. వాస్తవానికి అందులో పేర్కొన్నట్లు హెలికోబాక్టర్ అనేది బ్యాక్టీరియా అని కూడా వివరణ ఇచ్చింది.
========================================
ప్రచారం : భయంకరమైన హెలికోబాక్టర్ అనే పురుగును కలిగి ఉన్న 500 టన్నుల అరటిపండ్లు సోమాలియా నుంచి దిగుమతి అయ్యాయి. అవి తిన్నవాళ్లు 12 గంటల్లోనే బ్రెయిన్ డెడ్ అయి చనిపోతారు.
వాస్తవం : ఇది తప్పుడు వీడియో. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో అయిన ప్రచారాన్ని అబుదాబి ప్రభుత్వం ఖండించింది. ఈ వీడియోలను ఇంటర్నెట్ నుంచి తొలగించింది. భారత ఆహార భద్రత- ప్రమాణాల సంస్థ - fssai కూడా ఈప్రచారాన్ని ఖండించింది.
కంక్లూజన్ : హెలికోబాక్టర్ అనేది పురుగు కాదు... ఒక రకమైన బ్యాక్టీరియా మాత్రమే. దీనితో ప్రాణాపాయం ఏదీ ఉండదు. ఈ వైరల్ పోస్ట్ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
========================================
నా పరిశీలన ప్రకారం అందులో కనిపిస్తోంది క్యాండిల్స్ తయారీలో వాడే వత్తి. దానిని మడతలు వేసి అరటిపండు లోపలకు గుచ్చి, ఓపెన్ చేశాక బయటకు వచ్చినట్లు చూపించారు. ఇక ఆ వీడియోపై ఉన్న భాష.. అది ఇంగ్లీష్ కాదు, ఫ్రెంచ్. regardez bien avant de manger అనే వాక్యానికి అర్ధం.. take a good look before you eat. కాబట్టి ఇది ఇండియాకి సంబంధించిన వారెవరో క్రియేట్ చేసింది కాదు. అరటిపండ్లను ఇతర దేశాలకు ఎక్స్ పోర్ట్ చేస్తున్న ఇండియా సోమాలియా నుంచి మామూలు రకం అరటిపండ్లను ఇంపోర్ట్ చేసుకునే అవకాశం లేదు. పైగా ఆ మెసేజి ఎప్పటి నుంచి సోషల్ మీడియాలో తిరుగుతోందో.. ఎప్పటి నుంచి తినటం మానేయాలో.. వెర్రిబాగుల జనం ఏదైనా నమ్మేస్తారు అనుకున్నవాడెవడో ఈ మెసేజీని ఫార్వర్డ్ చేసి నవ్వుకుంటూ ఉండి ఉంటాడు.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete