కొవిడ్ కాలం తర్వాత అడిగి మరీ అప్పులు ఇచ్చే సంస్థలు ఎక్కువయ్యాయి. ప్రత్యేకంగా లోన్ల కోసమే యాప్లు క్రియేట్ చేసి మరీ అప్పులిస్తామంటూ మెస్సే...
కొవిడ్ కాలం తర్వాత అడిగి మరీ అప్పులు ఇచ్చే సంస్థలు ఎక్కువయ్యాయి. ప్రత్యేకంగా లోన్ల కోసమే యాప్లు క్రియేట్ చేసి మరీ అప్పులిస్తామంటూ మెస్సేజ్లు పంపిస్తున్నారు. లోన్ ఇచ్చేందుకు అని చెబుతూ మన వివరాలు తెలుసుకుంటున్నారు. మరి.. ఇలాంటి మెస్సేజ్లను నమ్మొచ్చా...
కరోనా కాలం తర్వాత చాలా మంది పరిస్థితి కుదేలయ్యింది. ఆర్థిక పరిస్థితులు అతలాకుతలమయ్యాయి. అనేకమంది కుటుంబాలను పోషించే పరిస్థితులు కూడా లేని స్థాయికి దిగజారిపోయారు. కానీ, కనీస అవసరాలు, నిత్య జీవితంలో ఖర్చులు మాత్రం తప్పలేదు. దీంతో, మెజార్టీ జనం సేవింగ్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి. దీంతో, అప్పులవైపు చూడటం అనివార్యంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో బ్యాంకుల చుట్టూ అప్పులకోసం తిరగడం, వాళ్లు అడిగే నిబంధనలన్నీ పాటించడం, చూపించడం వంటి ప్రహసనం లేకుండా ఎస్ఎంఎస్ పంపించి మరీ లోన్లు ఇస్తామంటుండటంతో చాలామంది వాటికి అట్రాక్ట్ అయ్యారు.
ఇలా.. కొన్నిమెస్సేజ్లేమో ఎస్ఎంఎస్ రూపంలో వస్తుండగా.. మరికొన్ని మెస్సేజ్లు వాట్సప్కు వస్తున్నాయి. డబ్బులు అవసరం ఉన్నవాళ్లను టెంప్ట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో లోన్లు అవసరం ఉన్నవాళ్లు తమ రహస్య వివరాలు కూడా షేర్ చేసుకుంటున్నారు.
అలాంటి ఓ మెస్సేజ్ చూద్దాం..
ఈ మెస్సేజ్లో వాళ్లు ఎంతమేరకు లోన్ ఇస్తారో కూడా పేర్కొన్నారు. దీనికి ఒక లింక్ను కూడా జోడించారు. లోన్ కావాలనుకుంటే ఆ లింక్ ఓపెన్ చేయాలని సూచించారు. ఆ లింక్ పంపించిన మొదట్లో సైట్ ఓపెన్ అయ్యింది. అందులో మన ఆధార్కార్డు, పాన్కార్డు వివరాలు, బ్యాంకు అకౌంట్ వివరాలు అడుగుతోంది. ఆ వివరాలన్నీ అందించాక కొందరికేమో చెప్పిన దానికన్నా తక్కువగా ఎంతో కొంత లోన్కు అర్హత ఉన్నారంటూ సమాచారం ఇస్తున్నారు. మరికొందరికేమో లోన్ ఇచ్చేందుకు అర్హత లేదని చెబుతున్నారు.
కానీ, అప్పటికే మన పర్సనల్ సమాచారం వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. మనం టైప్ చేసిన సమాచారం వాళ్ల డేటాబేస్లో సేవ్ అవుతోంది.
ఇక, లోన్ ఇచ్చిన వాళ్ల విషయం చూస్తే.. ప్రాసెసింగ్ ఫీజులు, ఇతరా గట్రా వసూలు చేస్తున్నారు. అధిక మొత్తంలో వడ్డీ వసూలు చేస్తున్నారు. అవసరం ఉన్నవాళ్లు వాళ్లు పెట్టే కండిషన్లకు ఓకే చెబుతున్నారు.
మరికొన్ని ఫిషింగ్ లింకులు కూడా ఈ పేరుతో ఎస్ఎంఎస్ల రూపంలో పంపిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు. అందులో మన సమాచారం మొత్తం షేర్ చేయగానే రెస్పాన్స్ రావడం లేదు.
ఇక, ఆ లింకులు కొద్దిరోజులు దాటాక ఓపెన్ చేస్తే ఎర్రర్ వస్తోంది. అంటే, అవేవో తాత్కాలిక లింకులు అనే దానికి బలం చేకూరుతోంది.
ఇలాంటి లింకుల పట్ల కింది అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని Factful హెచ్చరిస్తోంది.
1) పేరూ ఊరూ లేకుండా వచ్చే ఇలాంటి లింకులను అనుమానించాలి.
2) అసలు మన వివరాలే వాళ్లకు తెలియకుండా ఎంత లోన్ ఇస్తామో ముందుగానే చెప్పేస్తారు. అంటే సందేహాస్పదం.
3) గుర్తు తెలియని ఈ యాప్లలో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం ఏమాత్రం క్షేమం కాదు.
4) ఈ సమాచారం వాళ్ల డేటాబేస్లోకి నిక్షిప్తం అవుతుంది. వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు అవసరాల కోసం మన ప్రమేయం లేకుండానే వీటిని సైబర్ నేరగాళ్లు ఉపయోగించుకునే వీలుంటుంది.
5) అంతేకాదు.. కొన్నిసార్లు ఈ లింకుల్లో ఫిషింగ్ మోసాలుంటాయి. మన బ్యాంకు అకౌంట్లను కూడా యాక్సెస్ చేసి బ్యాలన్స్ అంతా తమ ఖాతాలకు మళ్లించుకుంటారు.
6) ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఐఆర్డీఎ మార్గదర్శకాల ప్రకారం నిర్ధారిత బ్యాంకులు, సంస్థలు మాత్రమే లోన్లు ఇచ్చేందుకు అర్హత కలిగి ఉంటాయి.
7) ఇలాంటి తాత్కాలిక సంస్థలు ఇప్పటికిప్పుడు లోన్ ఇస్తే ఇవ్వొచ్చు గానీ, తర్వాత మనకు వీటివల్ల నష్టమే ఎక్కువగా ఉంటుంది.
8) కాస్త ప్రయాస అయినా, గుర్తింపు పొందిన బ్యాంకులు, సంస్థలనే లోన్లకోసం ఆశ్రయిస్తే లాభదాయకం. ప్రాసెసింగ్ ఫీజులు, వడ్డీలు తక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా మనం చెల్లించలేకపోతే చార్జీలు కూడా తక్కువగానే ఉంటాయి.
9) ఇలాంటి లింకులను అసలు ఓపెన్ చేయకుండా ఉండటమే క్షేమకరమని Factful హెచ్చరిస్తోంది.
Thanks for your valuable information please
ReplyDelete